అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ స్థానంలో మరొకరిని, అది రిపబ్లికన్ నేత అయినా సరే అంగీకరించేవాళ్లం కాదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్పై కాల్పులు, చెవిని తాకుతూ తూటా దూసుకెళ్లిన ఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాటి హత్యాయత్నం ఘటనలో ట్రంప్ చనిపోయి ఉన్నట్లయితే అంతర్యుద్ధ పరిస్థితులు తలెత్తి ఉండేవని, దేశం ఎప్పటికీ సాధారణ స్థితికి వచ్చి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. భారీ కుట్రలో భాగంగానే ఆ దారుణం జరిగిందని తనతో పాటు ట్రంప్ అభిమానులు అందరూ కూడా భావిస్తుండేవాళ్లమని క్రిస్టియన్ పాడ్కాస్టర్తో సంభాషణ సందర్భంగా జేడీ వాన్స్ వెల్లడించారు.
అధ్యక్షుడిని దుష్టశక్తులు తీసుకెళ్లాయనుకున్నా..
అధ్యక్షుడిగా ఎన్నికై శ్వేతసౌధంలోకి ప్రవేశించాల్సిన తమ నేతను దుష్టశక్తులు తీసుకెళ్లాయని తాను సైతం అనుకునే వాడినని తెలిపారు. అదే జరిగి ఉంటే దేశ రాజకీయ వ్యవస్థకు చట్టబద్ధత లేకుండా పోయేదని అభిప్రాయపడ్డారు. డెబ్బై నిమిషాల పాటు కొనసాగిన పాడ్కాస్ట్ సంభాషణలో జేడీ వాన్స్ దైవంపై విశ్వాసం, తన ఆధ్యాత్మిక ప్రయాణం, పోప్ ఫ్రాన్సిస్ మరణానికి ఒక రోజు ముందు ఆయనతో భేటీ, మానవుల చంచలత్వం, లోపాల గురించి, ఆధ్యాత్మిక శూన్యత గురించి మాట్లాడారు.
ట్రంప్ సోషల్ మీడియా పోస్టులపై స్పందన..
తానే ఏసుక్రీస్తు అన్నట్లుగా ఒక చిత్రాన్ని ట్రంప్ సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టును వాన్స్ సమర్థించారు. ‘దేవుడిని పరిహసించడం, తక్కువ చేయడం అన్నది ట్రంప్ నైజం కాదు’ అని పేర్కొన్నారు. క్లిష్టమైన విషయాలను తేలికపరచడానికి నిరంతరం జోకులు వేస్తుంటారని, తనవెంట ఉన్న వారి పట్ల కఠినంగా ఉన్నట్లు, చికాకుపెట్టినట్లు కనిపిస్తారు కానీ ఎల్లప్పుడూ సరదాగా, ఉల్లాసంగా ఉండాలనే ట్రంప్ కోరుకుంటారని జేడీ వాన్స్ వివరించారు.
