అమెరికా వెళ్లే విద్యార్థులు , ఐటీ నిపుణులు ఎదుర్కొంటున్న వీసా అపాయింట్మెంట్లు, రెన్యువల్స్ జాప్యం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్గియో గోర్తో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ కీలక చర్చల్లో, ముఖ్యంగా H-1B వీసా నిబంధనల సరళీకరణ, విద్యార్థులకు వీసా స్లాట్ల పెంపు వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు.
H-1B వీసా ప్రక్రియలో మార్పుల కోసం విజ్ఞప్తి..
అమెరికాలో పని చేస్తున్న ఐటీ నిపుణులు వీసా రెన్యువల్, స్టాంపింగ్ పనుల కోసం స్వదేశానికి వచ్చినప్పుడు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, H-1B వీసా ప్రాసెసింగ్ను వేగవంతం చేయాలని, నిబంధనలలో మార్పులు ఏవైనా ఉంటే వాటిని దరఖాస్తుదారులకు ముందుగానే తెలిపేలా ఒక పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దీనివల్ల వృత్తిపరమైన అనిశ్చితి తగ్గి ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.
విద్యార్థుల ఇబ్బందుల తొలగింపు..
తెలంగాణ నుండి ప్రతి ఏటా వేల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తుంటారు. అయితే, వీసా ఇంటర్వ్యూ స్లాట్లు సకాలంలో దొరక్కపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు అడ్మిషన్ల సమయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు వీసా స్లాట్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని , ప్రాసెసింగ్ను త్వరితగతిన పూర్తి చేయాలని రాయబారి కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కోరారు. అలాగే, అమెరికాలో ఉంటున్న తెలుగు విద్యార్థుల భద్రత, సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని చర్చించారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం..
వీసా సమస్యల పరిష్కారంతో పాటు, తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రభుత్వం వివరించింది. ముఖ్యంగా ఐటీ, ఏఐ (AI), ఫార్మా, లైఫ్ సైన్సెస్, స్టార్టప్ రంగాల్లో భాగస్వామ్యానికి తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రంలోని విద్యాసంస్థలతో కలిసి ఉమ్మడి పరిశోధనలు, స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలు చేపట్టేందుకు సహకరించాలని సీఎం కోరారు. సీఎం ప్రతిపాదనలను సానుకూలంగా స్వీకరించిన అమెరికా రాయబారి, తెలంగాణతో వాణిజ్య, విద్యా సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీ సత్ఫలితాలను ఇస్తే, అమెరికాలో ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది తెలుగువారికి పెద్ద ఊరట లభిస్తుంది.
