అమెరికాలో సంచలనం సృష్టించిన తెలుగు యువతి నిఖిత గొడిశాల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్జున్ శర్మను తెలంగాణ పోలీసులు ఆగ్రాలో అరెస్ట్ చేశారు. నిందితుడిని దిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అమెరికా అభ్యర్థన మేరకు అతడిని ఆ దేశానికి అప్పగించే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు.
హైదరాబాద్లోని లాలాగూడకు చెందిన నిఖిత (27) ఉన్నత చదువుల నిమిత్తం నాలుగేళ్ల కిందట అమెరికా వెళ్లింది. గతేడాది డిసెంబర్ 31నే ఆమె హత్య జరిగినట్లు అమెరికా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, జనవరి 2న నిఖిత కనిపించడం లేదంటూ ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మనే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసి భారత్కు పారిపోయి వచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన అక్కడి పోలీసులు జనవరి 3న అపార్ట్మెంట్లో తనిఖీ చేయగా, కత్తిపోట్లతో కుళ్లిపోయిన స్థితిలో నిఖిత మృతదేహం లభించింది.
నిఖిత తన వద్ద చేసిన అప్పును తిరిగి ఇవ్వాలని అడిగినందుకే అర్జున్ ఆమెను హత్య చేశాడని ఆమె తండ్రి ఆరోపించారు. ఈ మేరకు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఆగ్రాలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
