సామాజిక మాధ్యమాలకు చిన్నారులు బానిసలవుతున్నారనే ఆరోపణలు, కోర్టు కేసుల నేపథ్యంలో టెక్ దిగ్గజం ‘మెటా’ తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాప్లలో కీలక మార్పులు తీసుకొస్తోంది. అమెరికాలోని 48 రాష్ట్రాలతో కుదిరిన రాజీలో భాగంగా, సుమారు రూ. 1.71 లక్షల కోట్ల (1800 కోట్ల డాలర్లు) చెల్లించేందుకు అంగీకరించిన పరిణామ క్రమంలో ఈ నిబంధనలను ప్రకటిచింది.
కొత్త నిబంధనల వివరాలు..
18 ఏళ్ల లోపు చిన్నారులకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాప్లు రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే అందుబాటులో ఉండేలా నియంత్రణలు తీసుకురానున్నట్లు మెటా తెలిపింది. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ యాప్లను వినియోగించుకోవడానికి వీలు లేకుండా బ్లాక్ చేయనున్నారు. 13 ఏళ్ల లోపు చిన్నారులకు ఈ వేదికలలో ఖాతాల ప్రారంభాన్ని అస్సలు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ ప్లాట్ఫారమ్లలో ‘లైక్’ల సంఖ్యను పూర్తిగా తొలగించనున్నారు. యాప్లను వాడేవారి వయసును నిర్ధారించుకోవడానికి, నిబంధనలను పక్కాగా పాటించేలా చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగిస్తామని కేసుల పరిష్కారంలో భాగంగా మెటా హామీ ఇచ్చింది. చిన్నారులకు ఎలాంటి హాని కలగకుండా భద్రతాపరమైన మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని మెటా వెల్లడించింది.
