అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రాన్ని సోమవారం శక్తివంతమైన టోర్నడో తీవ్రంగా తాకింది. ఈ పెను తుఫాను ధాటికి విస్కాన్సిన్తో పాటు అమెరికా మధ్య పశ్చిమ ప్రాంతంలోని పలు రాష్ట్రాల్లో దాదాపు 3.9 లక్షలకు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మెనాషా, యాపిల్టన్ నగరాలపై ఈ విపత్తు తీవ్ర ప్రభావం చూపింది. ఈ టోర్నడో ఉధృతికి పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు భారీ వృక్షాలు నేలకూలాయి. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల వల్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సుమారు 20 నిమిషాల పాటు ఈ భీకర తుఫాను విలయతాండవం సృష్టించిందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో విస్కాన్సిన్లోని వైట్వాటర్ ప్రాంతంలో చెట్ల కొమ్మలను తొలగిస్తున్న ఒక విద్యుత్ శాఖ కార్మికుడిపై పిడుగు పడటంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ టోర్నడోను అత్యంత ప్రమాదకరమైనదిగా అమెరికా వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం సహాయక బృందాలు రంగంలోకి దిగి నష్టాన్ని అంచనా వేయడంతో పాటు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రక్షణ చర్యలు చేపట్టాయి. మరోవైపు గ్రేట్ లెక్స్, ఒహాయో వ్యాలీ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలను అప్రమత్తం చేశారు.
