పశ్చిమాసియాలో తమకు సవాలుగా మారిన ఇరాన్ను ఏకాకి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్యలను మరింత ఉద్ధృతం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఇరాన్ విమానయాన పరిశ్రమపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. ఇరాన్కు చెందిన పలు వాణిజ్య, ప్రైవేట్ విమానయాన సంస్థలతో పాటు విదేశీ కార్గో సేవల సంస్థలను కూడా ఈ ఆంక్షల పరిధిలోకి తెచ్చింది. ఇప్పటికే ఇరాన్పై అమలవుతున్న భారీ ఆంక్షల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇరాన్కు ఆర్థిక జీవనాధారంగా నిలుస్తున్న కీలక రంగాధారాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వ్యాపారం చేస్తే తీవ్ర పరిణామాలు..
ఇరాన్ విమానయాన సంస్థలతో ఎవరైనా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ హెచ్చరించారు. అలాంటి సంస్థలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా పక్కనపెట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇరాన్ ఏవియేషన్ సంస్థలతో వ్యాపారం చేసే విదేశీ సంస్థలు, ప్రభుత్వాలు సైతం అమెరికా ఆంక్షల బారిన పడతాయని, అమెరికా పరిధిలో వారి ఆస్తులను కూడా స్తంభింపజేసే అవకాశం ఉందని తెలిపారు. కాగా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కజకిస్తాన్, మలేషియాల్లోని పలు ప్రైవేట్ సంస్థలు ఇరాన్కు చెందిన మహాన్ ఎయిర్కు విడిభాగాలు, లాజిస్టిక్స్ సేవలను అందిస్తున్నాయని అమెరికా ప్రభుత్వం ఈ సందర్భంగా ఆరోపించింది.
